మాయా ద్వీపం..వెళ్తే అంతే..!తిరిగి రారనే కథలో నిజమెంత ?

కెన్యాలోని నో రిటర్న్ ద్వీపం మిస్టరీ

ఆ మాయా ద్వీపం పేరు చేబితే..ఆ ద్వీపం గురించి తెలిసిన వారంతా…అక్కడి వెళ్ళిన వారు తిరిగి రారని భయపెడతారు.దీంతో వెళ్ళాలని అనుకునేవారు రిస్క్ ఎందుకులే అని కామ్ అయిపోతారు.. మరి కొందరు రిస్క్ చేసి ఆ మాయా ద్వీపం దగ్గరకు వెళ్ళే.. స్థానికులు చెప్పే కధలు విని తిరిగి వచ్చేస్తారు.అంతలా ఈ ద్వీపం అందరిని భయపెడుతోంది.

ఒకప్పుడు అక్కడ నివసించిన గ్రామ ప్రజలు ఒక్కసారిగా అదృశ్యమయ్యారని…ఆ రహస్యాన్ని ఛేదించడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు కూడా తిరిగి రాలేదనే ప్రచారంతో పర్యాటకులు అటు వైపు వెళ్ళాలంటేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి…అంతలా భయపెట్టే ఈ ద్వీపానికి వెళ్తే మనుషులు నిజంగా మాయమైపోతున్నారా..? స్థానికులు చెప్పేదంతా నిజమేనా అని తెలుసుకోవాలంటే…ఈ ద్వీపం గురించి తెలుసుకోవాల్సిందే..!

Kenya(కెన్యా)ఉత్తర ప్రాంతంలోని Lake Turkana చుట్టూ ప్రచారంలో ఉన్న ఎన్వైటెనెట్ (Envaitenet) అనే మిస్టరీ ద్వీపాన్ని చాలామంది ‘Island of No Return’ అని పిలుస్తారు.అయితే నిజంగానే అక్కడికి వెళ్లినవాళ్లు అదృశ్యమయ్యారా? ద్వీపంలో ఏదైనా ప్రమాదకరమైన రహస్యం ఉందా? లేక తరతరాలుగా ప్రచారంలో ఉన్న కథలు కాలక్రమంలో మరింత భయానకంగా మారాయా అంటే.. అసలు ఎన్వైటెనెట్ కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా టర్కానా సరస్సు గురించి తెలుసుకోవాలి ..!

టర్కానా సరస్సు..
ఇది సాధారణ సరస్సు కాదు. UNESCO ప్రకారం,టర్కానా ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సరస్సు. దాని చుట్టూ ఉన్న భూభాగం అత్యంత పొడిగా, కఠినంగా ఉంటుంది. సరస్సు పరిసరాల్లోని మూడు జాతీయ పార్కులు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి. దాదాపు మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా కనిపించే భూభాగం, తీవ్రమైన వేడి, ఒంటరి ప్రాంతాలు..ఇవన్నీ టర్కానాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని ఇస్తాయి.ఈ నేపథ్యమే ద్వీపం చుట్టూ ఉన్న మిస్టరీ కథలకు మరింత బలం చేకూర్చింది.

ద్వీపానికి ‘నో రిటర్న్’ అనే పేరు ఎలా వచ్చింది ?
ఎన్వైటెనెట్ అనే పేరుకు ‘తిరిగి రాని ప్రదేశం’ అనే అర్థం వస్తుందని అనేక కథనాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ ఈ అనువాదానికి బలమైన భాషా ఆధారాలు చరిత్రలో ఎక్కడా సరిగా లేవు.

ఒక గ్రామం మొత్తం అదృశ్యమైందా..?
ఎన్వైటెనెట్ కథలో అత్యంత భయానకమైన భాగం ఇదే.స్థానిక కథనాల ప్రకారం..ఒకప్పుడు కొన్ని కుటుంబాలు ద్వీపంలో నివసించేవారట. వారు చేపలు పట్టుకుని జీవించేవారని, అప్పుడప్పుడు సరస్సు తీరంలోని ప్రజలతో సంబంధాలు కొనసాగించేవారని రకా రకాల కథలు ఉన్నాయి.అయితే ఓ రోజు..అక్కడకు వెళ్ళిన పర్యాటకులకు..అక్కడ మనుషులు కనిపించలేదని, గ్రామం ఖాళీగా ఉందని గుర్తించారు.అయితే అదృశ్య ఘటనను నిర్ధారించే బలమైన అధికారిక రికార్డులు లేదా పత్రాలు స్పష్టంగా లేవు.

1935లో ఇద్దరు పరిశోధకులు మాయమయ్యారా?

ఎన్వైటెనెట్ గురించి ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ ప్రకారం..1935లో ఇద్దరు వ్యక్తులు ద్వీపానికి వెళ్లి తిరిగి రాలేదట. Martin Sheflis, Bill Dyson అనే ఇద్దరు వ్యక్తులు కనిపించకుండా పోయారని ఓ కథ ప్రచారంలో ఉంది.అయితే ఆ ఇద్దరు కనిపించకుండా పోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు.ఎందుకంటే..టర్కానా ప్రాంతం భౌగోళికంగా కఠినమైన ప్రాంతం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సరస్సుగా ఉన్న ఇది పొడి, కఠినమైన భూభాగంతో చుట్టుముట్టి ఉంటుంది.ఇలాంటి ప్రాంతాల్లో గతంలో సమాచార వ్యవస్థలు లేని కాలంలో ఎవరైనా ప్రమాదానికి గురైతే వారి గురించి తెలుసుకోవడం చాలా కష్టమయ్యేది. పడవ ప్రమాదం, దారి తప్పడం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు లేదా వన్యప్రాణుల ముప్పు వంటి అనేక సహజ కారణాలు ఉండవచ్చు.అలాగే ఇటీవలి సంవత్సరాల్లో.. టర్కానా సరస్సు తీర ప్రాంతాల్లో మొసళ్ల దాడులు ప్రాణనష్టానికి కారణమవుతున్నట్లు నివేదికలు ఉన్నాయి.

ఎల్‌మోలో ప్రజలు.. సరస్సుతో ముడిపడిన టర్కానా జీవితం..

టర్కానా సరస్సు ఆగ్నేయ తీర ప్రాంతాల్లో ఓ గుంపు నివసిస్తోంది. వారి జీవన విధానం చారిత్రకంగా సరస్సు, చేపల వేటతో బలంగా ముడిపడి ఉంది. ఒక అధ్యయనం ప్రకారం …వారిని టర్కానా సరస్సు ఆగ్నేయ తీరంలోని చిన్న సముహంగా గుర్తించారు.వీరంతా ఒక్కసారిగా కనపడకుండా పోవటంతో ఈ ద్వీపం ఓ మాయా ద్వీపంగా ప్రచారం పోందింది.

మాయ ద్వీపం మిస్టరీ వెనుక..

ఎన్వైటెనెట్ కథను పరిశీలిస్తే .. కఠినమైన వాతావరణం, ఒంటరి ప్రాంతం, సరస్సు ప్రయాణంలోని ప్రమాదాలు ప్రధాన కారణం.అలాగే తరతరాలుగా చెప్పుకునే హెచ్చరికలు, అదృశ్యాల కథలు, భయాలు.మరో వైపు స్పష్టమైన ఆధారాలు లేకుండానే కథలకు కొత్త వివరాలు, పేర్లు, తేదీలు జోడించడం.ఈ కారణాలతో ఈ ద్వీపం ప్రపంచ ప్రసిద్ధ మిస్టరీగా మారిపోయింది.టర్కానా సరస్సు నిజం. దాని కఠినమైన భౌగోళిక పరిస్థితులు నిజం. అక్కడి సమాజాల ప్రత్యేక జీవన విధానం కూడా నిజం.కానీ ఎన్వైటెనెట్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరూ అదృశ్యం కావడం,ఓ గ్రామం మొత్తం మాయమైపోవడం.. 1935లో ఇద్దరు పరిశోధకులు అక్కడికి వెళ్లి అదృశ్యం కావడం వంటి సంచలన వాదనలకు బలమైన ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఎక్కడా కనిపించడం లేదు.అందుకే ఈ కథను పూర్తిగా నిజం అని చెప్పలేం.అదే సమయంలో స్థానికులు చెప్పే కథ కూడా కొట్టిపారేయలేం.

ఎన్వైటెనెట్ అసలు మిస్టరీ అక్కడ మనుషులు మాయమవుతున్నారా అన్నది మాత్రమే కాదు. ఆధారాలు తక్కువగా ఉన్న ఒక స్థానిక కథ ప్రపంచవ్యాప్తంగా ఇంతగా పాపులర్ కావడం బహుశా… సోషల్ మీడియాలో ప్రభావం కావచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: © Voice Media Telugu. This content is protected. Copying or reproduction without permission is prohibited.